తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. త్వరలో 1,050 కొత్త బస్సులు: ఎండీ సజ్జనార్

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని ట్వీట్ చేశారు.

Courtesy: x

Share:

హైదరాబాద్‌: ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.రూ.400 కోట్ల వ్యయంతో వెయ్యికి పైగా అధునాతన డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 80 బస్సులను శనివారం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందని సజ్జనార్ తెలిపారు. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోందన్నారు. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. 

సంస్థ కొనుగోలు చేయాలనుకొనే వాటిలో 400 ఎక్స్‌ప్రెస్‌, 512 పల్లె వెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని సజ్జనార్ వివరించారు. వీటికి తోడు హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సజ్జనార్‌ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌లో భాగంగా రద్దీ పెరగడంతో కొత్త బస్సులను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.

‘‘అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వినియోగంలోకి వస్తాయి. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్‌, 30 రాజధాని ఏసీ, 20 లహరీ స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులు ఉన్నాయి. ఈ కొత్త బస్సులను హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తాం. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు’’ అని సజ్జనార్‌ తెలిపారు.