తిరుమల భక్తులకు శుభవార్త.. ఏప్రిల్ ఆర్జిత సేవా టికెట్ల కోటా రిలీజ్

TTD : తిరుమల భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. 2024 ఏప్రిల్​లో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికోసం.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదులు ఆన్​లైన్​లో బుక్ చేసుకునేందుకు వెబ్ సైట్ లో అవకాశం కల్పించింది.

Courtesy: x

Share:

తిరుమల: తిరుమల భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త తెలిపింది. 2024 ఏప్రిల్​లో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికోసం.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదులు ఆన్​లైన్​లో బుక్ చేసుకునేందుకు వెబ్ సైట్ లో అవకాశం కల్పించింది. తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం (గురువారం )ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఇందుకు సంబంధించి తితిదే వెబ్ సైట్ లో టికెట్లు రిలీజ్ చేసింది.  లక్కీడిప్ ​లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించి.. టికెట్లు కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఇక కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవాటికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అదేవిధంగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇక అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేయనుండగా.. శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

24న స్పెషల్ దర్శనం టికెట్ల విడుదల
జనవరి 24న ఉదయం 10 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను జనవరి 27న ఉదయం 11గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటిగంటకు వెబ్​ సైట్​లో అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్​లో తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్​సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.