పల్లె బాటలో నగర జనం.. సంక్రాంతి సెలవులతో బస్టాండ్లు కిటకిట

Sankranthi festival: సంక్రాంతి పండగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది.

Courtesy: ANI

Share:

హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. నగరంలో ఉండే జనాలు చాలా మంది సొంత ఊర్లకు బాట పట్టారు. నేటి నుంచి ఈ నెల17 వరకు స్కూళ్లకు, ఈ నెల13 నుంచి 16 వరకు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో  కుటుంబ సమేతంగా తరలివెళ్తుండగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. 

హైదరాబాద్లోని జేబీఎస్​, ఎంజీబీఎస్​, ఉప్పల్, ఎల్​బీనగర్,​ ఆరాంఘర్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైల్వే స్టేషన్ల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలోని ముఖ్య జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి రావడంతో మహిళలు ఎక్కువ శాతం ప్రయాణిస్తుండటంతో బస్సుల్లో పుల్ రష్ ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద కూడా భారీగా రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు వరుస కట్టాయి. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి.

ప్రత్యేక బస్సులు
పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ అన్నిఏర్పాట్లు చేసింది. పండుగ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సిటీ బస్సులను సైతం ప్రత్యేకంగా జిల్లాలకు వేశారు. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరగనుంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎల్​బీనగర్​లోని విజయవాడ బస్టాప్ వద్ద షామియానాలు, కుర్చీలు, పబ్లిక్​ అడ్రస్ ​సిస్టం, మొబైల్ ​టాయిలెట్స్​ ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతా దృష్ట్యా.. రద్దీ ఎక్కువగా ఉండే ఆరాంఘర్​లో 6​, ఉప్పల్​లో16, ఎల్​బీనగర్​ లో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్ ​లోని కమాండ్​ కంట్రోల్ ​సెంటర్ ​కు లింక్ చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

రాష్ట్రంతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం సౌత్​ సెంట్రల్​ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నెల 7 నుంచే ఈ స్పెషల్ సర్వీసులను ప్రారంభించింది. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఈ నెల 27 వరకు 38 స్పెషల్​ సర్వీసులను నడుపనుంది.