పది రోజుల్లో అంగన్వాడీలు విధుల్లో చేరకపోతే.. కొత్త వారిని తీసుకుంటాం: సజ్జల

Sajjala Ramakrishna Reddy: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిరసనల పేరుతో అంగన్వాడీలు తీగ తెగేవరకు లాగకండంటూ సజ్జల స్పష్టం చేశారు.

Courtesy: x

Share:

విజయవాడ: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ సర్కార్ కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిరసనల పేరుతో అంగన్వాడీలు తీగ తెగేవరకు లాగకండంటూ సజ్జల స్పష్టం చేశారు. నోటీసుల్లో పేర్కొన్నట్టు 10 రోజుల్లో విధుల్లో చేరకపోతే అంగన్‌వాడీల ఉద్యోగాలు పోయినట్లే, ఆ తర్వాత కొత్తవారి నియామక ప్రక్రియ చేపడతామంటూ తెలిపారు. ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్‌వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 

అంగన్ వాడీ కార్యకర్తలు 32 రోజులుగా సమ్మె చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపామని అన్నారు. "అంగన్వాడీల సమస్యల పరిష్కారానికే మేం ప్రయత్నిస్తున్నాం. 11 డిమాండ్‌లలో‌ పదింటికి అంగీకారం తెలిపాం. సమ్మె విరమణకు మా‌వంతు ప్రయత్నం చేశాం. వేతనం పెంపు విషయంలో వాళ్లు పట్టుబట్టారు. వారికి రిటైర్మెంట్ బెన్ ఫిట్‌ రూ.50 వేలు, రూ.20 వేలు ఉండేవి. అంగన్ వాడీ కి రూ.50 వేల నుంచి రూ.70 వేలకు, హెల్పర్ కు రూ.20 వేలనుంచి రూ.50 వేలకు పెంచాం. మట్టి ఖర్చులు ఇరవై వేలకు అంగీకరించాం. గత ప్రభుత్వం ఆరు నెలల ముందే వేతనం‌ పెంచింది. ఐదేళ్ల తరువాత రివైజ్ చేయడం మా విధానం. వచ్చే ఆర్ధిక సంవత్సరం లో వేతనం పెంచుతామని హామీ ఇచ్చాం.జులై 2024 నుంచి పెంచేలా కమిట్ మెంట్ ఇస్తామని చెప్పాం." అని సజ్జల స్పష్టం చేశారు.

"పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకి పెంచాం. సర్వీస్ పరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని‌ చెప్పాం. మినీ అంగన్ వాడీ లకు జనాభాను బట్టి వేతనం నిర్ణయం చేస్తాం. సమ్మె కొనసాగిస్తే ప్రత్యామ్నాయ చర్యలు ఉంటాయి. ఎస్మా పరిధిలోకి తెచ్చామని రాజకీయ విమర్శలు చేశారు. పోరాటాన్ని అణచి వేసే చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు. నోటీసులు ఇస్తున్నాం. పది రోజుల నోటీసులు తరువాత స్పందించకుంటే ఆ స్థానంలో కొత్త వారిని నియమిస్తాం. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నారు. ఇకపై మేం ఉపేక్షించలేం. అంగన్వాడీలపట్ల సీఎం జగన్‌కు సానుభూతి ఉంది. తెగే వరలు లాగకండి... సమ్మె విరమించండి" అని తెలిపారు.