అయోధ్యలో ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ ప్రారంభించనున్న ప్రధాని

Maharshi Valmiki International Airport: రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన  అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.

Courtesy: IDL

Share:

దిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(శనివారం) శ్రీరామ జన్మభూమి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటించనున్నారు. రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన  అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు మోదీ అయోధ్యలో ఉండనున్నారు. మొత్తం రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. నగరాన్ని పూలతో అలంకరించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు

అయోధ్యలో రూ.1,450 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. ఇందులో 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అయోధ్యధామం’ అనే పేరు ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా వ్యవహరించేవారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్‌ జంక్షన్‌’గా నామకరణం చేశారు. ఇవాళ్టి నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా విమానాలు తిరగనున్నాయి. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. 

శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్‌ ఇండియా టెక్నికల్, ఎకనామిక్‌ సరీ్వస్‌ లిమిటెడ్‌(రైట్స్‌) అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. 

రాష్ట్రంలో రూ.15,700 కోట్ల కంటే విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాకుండా అమృత్ భారత్ రైళ్లు, 6 వందేభారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభం తరువాత రాష్ట్రంలో చేచపట్టిన 15,700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో అయోధ్య పరిసర ప్రాంతాల్లోనే 11 వేల 100 కోట్ల ప్రాజెక్టులున్నాయి. మిగిలినవి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవి. అయోధ్యలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.