ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం: చంద్రబాబు

TDP Supremo Chandrababu: ఏపీలో ఎన్నికలను అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Courtesy: x

Share:

అమరావతి: ఏపీలో ఎన్నికలను అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటరు జాబితాలో అవకతకవలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు చూసిన తర్వాత వారు నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరిని పనిచేయకుండా చేసేందుకు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు, పవన్ ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. 

వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు చూసిన తర్వాత వారు నకిలీ ఓట్లు చేర్చేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరిని పనిచేయకుండా చేసేందుకు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. ‘‘ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. తెదేపా, జనసేన నేతలపై సుమారు 6-7వేల కేసులు పెట్టారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. వైకాపా అరాచకాలను సీఈసీకి వివరించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.’’ అని చంద్రబాబు చెప్పారు. 

ఒక్క దొంగ ఓటు ఉన్నా ఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తామన్నారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్నవారిని నియమించాలని ఈసీని కోరామని చంద్రబాబు తెలిపారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. బీఎల్‌వోలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారని తెలిపారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలని కోరినట్లు తెలిపారు. 

వాలంటీర్ వ్వవస్థ రాజ్యంగ విరుద్దమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీని కోరామన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగతాయని ఈసీ చెప్పిందని పవన్ వెల్లడించారు. దొంగ ఓట్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని జనసేనాని అన్నారు. దొంగ ఓట్లు ఎలా సృష్టించారో ఈసీకి వివరించామని చెప్పారు. చంద్రగిరిలో దాదాపు లక్ష దొంగ ఓట్లు నమోదయ్యాయని అన్నారు.