ప్రజాపాలన దరఖాస్తు ఫాం అమ్మితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ ఆగ్రహం

Telangana CM Revanth: అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైనన్ని దరఖాస్తులను ‘ప్రజాపాలన’లో అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని.. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ఫామ్‌లు బయట అమ్ముతుండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు  మరోసారి స్పష్టంగా సూచించారు.

గత ప్రభుత్వం ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచింది: భట్టి

గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్‌ కొనుగోలు కింద రూ.59,580 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ప్రతి శాఖనూ అప్పుల్లో ముంచిందని విమర్శించారు. కాబట్టి, ఇప్పుడు ప్రణాళికబద్ధంగా, ముందుచూపుతో అడుగులు వేయాల్సి ఉందన్నారు. ప్రతి శాఖలోని పరిస్థితులను సమీక్ష చేస్తున్నామని భట్టి తెలిపారు.