గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్

Telangana CM Revanth Reddy: 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుదుత్పత్తి కంపెనీలతో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని సీఎం అధికారులను ఆదేశించారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పంపిణీకి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో  బుధవారం సమీక్షించారు. ఈ  సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు.  

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని సీఎం అధికారులను ఆదేశించారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. నిపుణులతో చర్చించి, వివిధ రాష్ట్రాల విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించిన తర్వాత రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానం(పాలసీ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో ఎక్కువ ధర చెల్లించడానికి గల కారణాలు చెప్పాలని.. తక్కవ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదేశించారు.

2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని  అధికారులను  రేవంత్ రెడ్డి ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి.. ఎక్కడ మెరుగ్గా ఉందో నివేదికలు ఇవ్వాలన్నారు. నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం, ప్రభుత్వపరంగా ఉత్పత్తి పెంచడానికి, మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాల పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్ఠం చేశారు. కరెంటు దుర్వినియోగాన్ని అరికట్టాలని, సరఫరాలో నాణ్యతను పెంచాలని నిర్దేశించారు.