తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

TSRTC : తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని ప్రారంభించారు.

Courtesy: x

Share:

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త తెలిపింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని, 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రయాణీకుల కోసం మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ కాపాడుకుంటామన్నారు. సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. 

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ 21 రోజుల్లో మహిళా ప్రయాణీకుల రద్దీ పెరిగిందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మొత్తం 6 కోట్ల ఉచిత టికెట్లు విక్రయించామన్నారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్‌కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.

మరిన్ని బస్సుల కోసం రూ.400 కోట్లు
ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందని సజ్జనార్ శుక్రవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోందన్నారు. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందని స్పష్టం చేశారు. 

సంస్థ కొనుగోలు చేయాలనుకొనే వాటిలో 400 ఎక్స్‌ప్రెస్‌, 512 పల్లె వెలుగు, 92 లహరీ స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయని సజ్జనార్ వివరించారు. వీటికి తోడు హైదరాబాద్ నగరంలో 540, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు సజ్జనార్‌ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌లో భాగంగా రద్దీ పెరగడంతో కొత్త బస్సులను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.