TTD ఉద్యోగులకు శుభవార్త.. పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలో పనిచేసే ఉద్యోగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, వేతనాల పెంపు సహా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Courtesy: x

Share:

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలో పనిచేసే ఉద్యోగులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, వేతనాల పెంపు సహా పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పాలకమండలి తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

పోటు కార్మికులకు వేతనాలు రూ.10వేలు పెంచాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తిరుపతి నగరం సర్వతోముఖాభివృద్ధి చెందాలని భావిస్తున్నామని, తిరుపతి అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ చూసి ఇతర ప్రాంతాల వారు గొప్పగా చెప్పుకోవాలి అనేలా కృషి చేస్తున్నామన్నారు. తమ ప్రయత్నాలను అడ్డుకుంటున్న దుష్ట శక్తులకు బుద్ధి చెప్తామన్నారు. 

తితిదే తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవే. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 85 కోట్లతో 350 ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని తీర్మానించారు. శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కళ్యాణ కట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్ గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతియేటా ఇచ్చే ప్యాకేజీని మరో కోటి రూపాయలకు పెంపు చేశారు. ఫిబ్రవరిలో రెండు రోజులుపాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.

తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది. తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని, జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనులకోసం రెండు కోట్ల కేటాయింపు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా, శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు.