అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి.. పండగ పూట విషాదం

America Students Death: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు.

Courtesy: x

Share:

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి హఠాన్మరణం చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా, మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. అమెరికా వెళ్లిన 17 రోజులకే దినేశ్ మృతి చెందడంతో అతని ఇంట్లో పండగ పూట తీవ్ర  విషాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి పట్టణంలోని రాంనగర్‌కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్‌(23) బీటెక్‌ చదివారు. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వవిద్యాలయం(ఎస్‌హెచ్‌యూ)లో ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28న పయనమయ్యారు. వెళ్లిన 17 రోజులకే తమ కుమారుడు నిద్రలోనే చనిపోయినట్లు సమాచారం అందిందని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ఇతనితో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే మరణించడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.